రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన

English: President Droupadi Murmu arrives in Hyderabad for a five-day Telangana visit as part of her winter retreat.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌కు రానున్నారు. వార్షిక శీతాకాల విడిది కార్యక్రమంలో భాగంగా ఆమె ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.

రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. భద్రత, ట్రాఫిక్ మళ్లింపులు, నిరంతర విద్యుత్ సరఫరా మరియు వైద్య సౌకర్యాలపై సీఎస్ శాంతి కుమారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు పూర్తిచేసి కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

డిసెంబర్ 19న హైదరాబాద్‌లో జరగనున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభిస్తారు. డిసెంబర్ 20న బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే ‘టైమ్‌లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్’ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. పర్యటన ముగిసిన తర్వాత డిసెంబర్ 22న సోమవారం ఉదయం ఆమె తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share