అమీన్‌పూర్‌లో బీటెక్ విద్యార్థి పరువు హత్య సంచలనం

Aminpur BTech student Sravan Sai was killed in an honor-based attack linked to a love affair. Police say the incident began after a clash with the girl’s family.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి (19) హత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీ నందిగామకు చెందిన శ్రవణ్ హైదరాబాద్ శివారులోని మైసమ్మ గూడలో ఇంజినీరింగ్ చదువుతూ ఉండేవాడు. టెన్త్ క్లాస్‌ నుంచి పరిచయం ఉన్న శ్రీజ అనే యువతితో అతను ప్రేమలో ఉన్న సంగతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారి ప్రేమకథ ఆందోళనలకు దారితీసింది. యువతి తల్లిదండ్రులు ఇద్దరినీ దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ తరచూ జోక్యం చేసుకున్నట్లు సమాచారం.

ఇటీవల యువతి కుటుంబసభ్యులు పెళ్లి విషయం మాట్లాడాలని పేరుతో శ్రవణ్‌ను ఇంటికి పిలిచినట్లు తెలుస్తోంది. అక్కడ యువతి తల్లితో మాటల దాడి ఘర్షణగా మారింది. కోపంతో ఆమె బ్యాటుతో శ్రవణ్ తలపై బలంగా కొట్టినట్లు విచారణలో బయటపడింది. తీవ్ర గాయాలతో కుప్పకూలిన శ్రవణ్‌ను నిజాంపేట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. తమ కుమార్తెను ఏడాదికాలంగా కలవలేదని అబద్ధం చెప్పడంతో కోపోద్రిక్తులై కొట్టామని యువతి తల్లి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘర్షణలో జరిగినదా? లేక ముందే హత్య పథకం పన్నారా? అని పలు ప్రశ్నలపై విచారణ కొనసాగుతోంది. ప్రేమ వ్యవహారమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. యువతి కుటుంబసభ్యుల పాత్ర ఏమిటన్న దానిపై పూర్తిగా స్పష్టత రావడానికి మరింత విచారణ కొనసాగుతోంది.

శ్రవణ్ స్నేహితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాతో స్పందించారు. ఏడాదిన్నర కాలంగా శ్రవణ్–శ్రీజ ప్రేమలో ఉన్నారని, నాలుగు నెలలుగా అమ్మాయి ఇంట్లో ఒత్తిడి పెరిగిందని తెలిపారు. శ్రీజ తరచూ శ్రవణ్‌కు కాల్ చేసి ఇంటి నుంచి తీసుకెళ్లాలని చెబుతోందని, పెళ్లి విషయంపై మాట్లాడాలని పిలిపించి ఇలా దారుణంగా హత్య చేశారంటూ బాధ వ్యక్తం చేశారు. సంఘటనా స్థలం, యువతి కుటుంబసభ్యుల వాగ్దానాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share